ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ధర్నా చేస్తున్న రైతులను ఉద్దేశించి వైసీపీ నేత, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో రైతుల పేరుతో ఆందోళనలు చేస్తోంది పెయిడ్ ఆర్టిస్టులేనని అన్నారు. వారు నిజంగా రైతులే అయితే, ధర్నాలు చేస్తున్న వారి వద్ద ఆడికార్లు, మహిళలకు బంగారు గాజులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. అమరావతిలో రైతుల పేరుతో ఓ కార్పొరేట్ ఉద్యమం నడుస్తోందన్నారు. రాజధానిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఇవేవీ కనిపించడం లేదా ? అని పృథ్వీ ప్రశ్నించారు.
అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ 18 రోజులుగా 29 గ్రామాల్లోని రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అమరావతిలో ఆందోళన చేస్తున్నవారిలో టీడీపీ మనుషులు,పెయిడ్ ఆర్టిస్టులే ఉన్నారని పలువురు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అమరావతి ఆందోళనలన్నీ బోగస్ అని, అవన్నీ టీడీపీ డైరెక్షన్లో జరుగుతోన్న నిరసనలే ఆపార్టీ నేతలు విమర్శించారు. తాజాగా ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ కూడా ఇవే విమర్శలు చేయడంతో దుమారం రేపుతోంది.
మరోవైపు వైసీపీ నేతలు చేసిన ఆరోపణలను రాజధాని రైతులు ఖండించారు. తాము ఏ గ్రామానికి చెందిన వారిమో ఆధార్ కార్డులు చూపించాలా అని ప్రశ్నించారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని టీడీపీ డిమాండ్ చేస్తుండగా.. అభివృద్ది వికేంద్రీకరణ చేస్తామంటూ వైసీపీ చెబుతోంది. జీఎన్రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికలు కూడా అభివృద్ది వికేంద్రీకరణ గురించే ప్రస్తావించాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ను అమరావతి నుండి విశాఖ తరలించడం దాదాపుగా ఖాయమేనన్న వాదన బలంగా వినిపిస్తోంది.