అమరావతి: ఎప్పటికీ ప్రజారాజధాని అమరావతేనని టిడిపి అధినేత.మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. 13 జిల్లాల అభివృద్ధికి కావాల్సిన ఆదాయ వనరుల్ని సమకూర్చే రాజధాని అమరావతి అని చెప్పారు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. మంత్రులు రోజుకో మాట మాట్లాడి గందరగోళానికి గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర భవిష్యత్ను అంధకారంలోకి నెట్టేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అభివృద్ధి చేసి సంపద సృష్టిస్తే అది రాష్ట్రానికి ఆదాయ మార్గం అవుతుందని అన్నారు. 65శాతం తెలంగాణ ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ముంబై, బెంగళూరు, చెన్నై ఆయా రాష్ట్రాలకు ఆర్థిక వనరులుగా ఉన్నాయన్నారు. రాజధానిపై ప్రభుత్వం ఏడు నెలలుగా మీనమేషాలు లెక్కిస్తోందని మండిపడ్డారు. అయిదు కోట్ల మంది ఆంధ్రులు ఆలోచించాల్సిన అవసరం ఉందని ఉందన్నారు. అమరావతిలో తొమ్మిది వేల కోట్లకుపైగా పనులు చేపట్టామన్నారు.
డబ్బులు లేకుండా రాజధానిని కట్టాలన్న ఆలోచనలో భాగమే ల్యాండ్ పూలింగ్ విధానమని తెలిపారు. రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాలు ఇచ్చారని గుర్తు చేశారు.అమరావతిలో భూములు ఇచ్చింది ఎక్కువగా సన్న, చిన్నకారు రైతులేనన్నారు. ఎకరం కంటే తక్కువ భూమి ఉన్న రైతులు 20,490 మంది ఉన్నారని చెప్పారు.భూములు ఇచ్చిన రైతులకు ఆమోదయోగ్యమైన ప్యాకేజీ ఇచ్చినట్లు వెల్లడించారు. రాజధానిలో భూమిలేని వారికి 2,500 రూపాయల పెన్షన్ కూడా ఇచ్చామని చెప్పారు.అమరావతిలో రాజధాని లేకుండా చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అనేక అవకతవకలు జరిగాయని ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు.
రాజధాని మార్చడానికి వీరికి ఎవరు అధికారం ఇచ్చారని ప్రశ్నించారు. జగన్ నిర్ణయాలను సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా కూడా తప్పుబట్టారనీ, పిచ్చి తుగ్లక్కు 20 రెట్లు అని చెప్పుకొచ్చారని అన్నారు. పిచ్చి ముదిరితే ఇలానే ఉంటుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.దేశంలో రాజధాని మార్చిన చరిత్ర ఎక్కడా లేదని అన్నారు. ఈ ప్రభుత్వ చర్యల కారణంగా పది రోజులుగా రాజధాని ప్రాంతంలో రైతులు, మహిళలు, పిల్లలు అందరూ ఆందోళన చెందుతున్నారని అన్నారు.
అమరావతికి ముంపు సమస్య లేదని నిపుణులు చెప్పారనీ, భౌగోళికంగా రాజధానికి అనుకూలమనీ తెలియజేశారన్నారు. అందరి అభిప్రాయం తీసుకున్న తరువాత అమరావతిని రాజధానిగా నిర్ణయించడం జరిగిందని చంద్రబాబు చెప్పారు. ఆయన (జగన్)కు అనుభవం లేదు, చెపితే అర్థం చేసుకోడు, మూర్ఘంగా వ్యవహరిస్తున్నాడంటూ విమర్శించారు. రాష్ట్రానికి కంపెనీలు రావడం చాలా కష్టం.వెళ్లగొట్టడం చాలా ఈజీ అన్నారు. విశాఖకు వచ్చిన లులూ కంపెనీని ఎందుకు వెళ్లగొట్టారు. వాళ్లకు ఇచ్చిన స్థలం కూడా కాజేయాలనుకున్నారా అంటూ విమర్శించారు.
అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై ఎటువంటి విచారణకైనా సిద్ధమేననీ, దానితో పాటు విశాఖలో ఈ ఏడు నెలల కాలంలో జరిగిన భూకొనుగోళ్లపైనా సిబిఐ విచారణకు సిద్ధమేనా అని చంద్రబాబు ప్రశ్నించారు.రాజధాని విషయంపై నాడు ప్రతిపక్ష నేతగా, నేడు ముఖ్యమంత్రిగా జగన్ మాట్లాడిన మాటల వీడియోను, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు.