(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఏపీ రాజధాని అంశంపై నిపుణుల కమిటీ సిఫార్సులు, నివేదికల ఆధారంగా సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని విషయంలో ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ అధారంగా నిర్ణయం జరుగుతందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీలో పుట్టడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి చంద్రబాబు చేసిన అభివృద్ది అంటూ ఏమీ లేదని విమర్శించారు. చంద్రబాబు ఓ నెగిటివ్ మనిషి అని అభివర్ణించారు. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకుంటున్న వ్యక్తి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే బదులు తిరోగమనం పట్టించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో సీఎంగా చంద్రబాబు ఏపీలో చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్.. ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, దీన్ని చూసి చంద్రబాబు ఓర్వలేక కోర్టుకు వెళ్లి స్టేలు తెస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంలో బదిలీలు సాధారణమని, రాజకీయం చేయడం సరైంది కాదని విజయసారెడ్డి చెప్పారు. వైసీపీ ప్రభుత్వంపై కావాలనే చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
ఏపీ అసెంబ్లీలో భాగంగా మండలిలో చర్చ సందర్భంగా ఏపీ రాజధాని అమరావతేనని, మార్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని రాతపూర్వకంగా స్పష్టం చేసిన బొత్స సత్యనారాయణ మళ్లీ మాట మార్చారు. రాజధానిపై స్పష్టత కోసం ఓ కమిటీ వేశామని, ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత దానిపై అసెంబ్లీలో చర్చించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ రాజధాని వ్యవహరంలో గందరగోళానికి ఇప్పట్లో తెరపడే పరిస్థితి కనిపించడం లేదు. గత ప్రభుత్వం రాజధాని పేరుతో పెద్ద ఎత్తున దోచుకుందనే అంశాన్ని తెర మీదకు తీసుకురావడమే కాకుండా.. ప్రస్తుతమున్న రాజధాని అనువైన ప్రదేశం కాదని రాష్ట్ర మంత్రులు వాదిస్తున్నారు.