అమరావతి: విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందుకు గురుదక్షిణగానే సీఎం జగన్ రాజధానిని విశాఖకు తరలించాలనే నిర్ణయం తీసుకున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ కు రాజ్యంగం కన్నా శారదా పీఠామే మిన్న అని అన్నారు. పార్లమెంట్ ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం కన్నా స్వరూపానంద శాసనమే జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ అని మండిపడ్డారు. ఈ రోజు స్వరూపానందతో, ఈ నెల 13న తెలంగాణ సీఎం కేసీఆర్ తో జగన్ భేటీ వెనుక ఉద్దేశమేంటని ప్రశ్నించారు. ఆ ముగ్గరూ ఒకే పడవలో ప్రయాణిస్తున్నారని, వారి లక్ష్యం ఒక్కటేనని అన్నారు. రాజధాని తరలింపుపై ఐదు కోట్ల ప్రజల ఆందోళనలు చేస్తున్నా ముఖ్యమంత్రి జగన్కు పట్టడం లేదని విమర్శించారు.
అటు క్రిస్టియానిటి, ఇటు హిందూయిజం మధ్య తన ద్వంద్వ ప్రవృత్తి కప్పెట్టడానికే శారదాపీఠంకు జగన్మోహన్ రెడ్డి దగ్గర అయ్యారని యనమల ఆరోపించారు. కాశీ, హరిద్వార్ లకు జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్లి, పరిశుద్ద పరిచి, హిందూ ఓట్లకు చేరువ చేసి, సీఎం అయ్యేందుకు దోహదపడింది ఈ స్వరూపానంద స్వామీజినే అని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు అయినప్పటికీ ఆయనతో హిందుత్వ విధానంలో యాగాలు చేయించారని చెప్పారు. తనకోసం ఇంతచేసిన స్వామీజి స్వరూపానందకు గురుదక్షిణగానే రాజధాని విశాఖకు జగన్మోహన్ రెడ్డి తరలింపు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. రాజధానిపై వైసిపి ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు రాష్ట్రపతికి రాసిన లేఖ, కేంద్రానికి పంపిన వినతి అర్ధరహితమైనవి చెప్పారు. రాజధానిగా అమరావతి నిర్ణయాన్ని భారత పార్లమెంటు ఆమోదించిందని గుర్తు చేశారు. అమరావతిని ఏపి రాజధానిగా కేంద్ర ప్రభుత్వం ధ్రువీకరించిందని యనమల తెలిపారు.
సర్వే డిపార్ట్ మెంట్ మ్యాప్లో అమరావతిని రాజధానిగా చూపకపోతే రాష్ట్ర ఎంపీలు పార్లమెంటులో పట్టుబట్టారని.. కేంద్రం అమరావతిని రాజధానిగా చూపిస్తూ మరో మ్యాప్ విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మ్యాప్లో అమరావతికి స్థానం కల్పించకపోవడాన్ని లోక్ సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రస్తావించారని.. కానీ తమ ఎంపీ మిథున్ రెడ్డి ఘనతగా అప్పట్లో వైఎస్సార్సీపీ చెప్పుకుందన్నారు. మరి అమరావతిపై వైసీపీ ఎంపీ నోరు తెరవడం లేదని ప్రశ్నించారు. రాజధాని తరలింపు నిర్ణయంతో ముఖ్యమంత్రి, మంత్రులు తమ ఇళ్లనుంచి బైటకు వచ్చే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నెలకొల్పినట్లుగా ఉందన్నారు.
రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా మహిళలు, రైతులు, రైతు కూలీలు, విద్యార్ధులు, ఉద్యోగులు అందరూ రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్నారని చెప్పారు. రాక్షస రాజ్యంగా రాష్ట్రాన్ని ఈ ఏడు నెలల్లోనే మార్చారని, 12మంది టిడిపి కార్యకర్తలను హతమార్చారని ఆరోపించారు. ఇసుక కొరత సృష్టించి 60 మంది కార్మికులను ఆత్మహత్యలకు పురికొల్పారని, 200 రోజుల్లోనే 285మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వివరించారు. ఇప్పుడు రాజధాని తరలింపుపై ఆందోళనలతో తొమ్మిది మంది మరణించారని, వందలాది చిరుద్యోగుల ఆత్మహత్యా యత్నాలకు అంతే లేదన్నారు. ఇటువంటి విధ్వంసకర పాలన మున్నెన్నడూ చూడలేదని యనమల పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి జగన్ ఏ పరిస్థితుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ను కలుస్తున్నారో అర్ధం చేసుకోవాలి.. ఇది రాష్ట్రానికి మరింత నష్టం చేయడమే అవుతుందన్నారు. ఇప్పటికే ఏపీలో పరిస్థితులు పొరుగు రాష్ట్రాల మంత్రుల ముందు నవ్వులపాలైందని.. ఏపీలో పరిస్థితులు తమకు ఎలా లాభదాయకమో అక్కడి మంత్రులే చెబుతున్నారని.. ఆంధ్రప్రదేశ్ కు వీలైనంత నష్టం చేయడం, పొరుగు రాష్ట్రాలకు మేలు చేయడమే సీఎం జగన్ పాలసీగా పెట్టుకున్నారని విమర్శించారు. ఈ రోజు శారదాపీఠం స్వామీజీతో భేటీ.. 13న తెలంగాణ సీఎం కేసీఆర్తో సమావేశం వెనుక స్కెచ్ అందరికీ తెలిసిందేనని.. ఈ ముగ్గురూ ఒకే పడవలో ప్రయాణిస్తున్నారన్నారు. ఈ ముగ్గురి లక్ష్యం ఒకటేనని, ఇటువంటి ముఖ్యమంత్రిని దేశంలో ఏ రాష్ట్రంలో చూడలేదని ప్రజలే అంటున్నారని యనమల వ్యాఖ్యానించారు.