అమరావతి: అవకాశ వాద రాజకీయాలకు చిరునామాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మారారని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ సైద్ధాంతిక విలువులు మరిచాడని విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవకాశవాద రాజకీయానికి చంద్రబాబు అంబాసిడర్ వంటి వారని అన్నారు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాన్ని పవన్ దత్తత తీసుకున్నారని నాని విమర్శించారు. రాజకీయ ఆర్థిక ప్రయోజనాలే ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు ముందుకు పోతున్నారని ధ్వజమెత్తారు. అవకాశ వాద రాజకీయాలకు కొత్త చిరునామాగా పవన్ కళ్యాణ్ మారారన్నారు. బేషరతుగా ఎందుకు పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు తెలిపారని ప్రశ్నించారు.
“షరతులు పెట్టి హోదా అడిగి బీజేపీకి మద్దతు తెలపొచ్చు కదా? ఎందుకు పవన్ కళ్యాణ్ మోడీని అమిత్ షా ను హోదా అడగలేదు. బేషరతుగా మద్దతు అని చెప్పడానికి సిగ్గు లేదా. ఎందుకు బేషరతుగా మద్దతు అంటున్నారు. మీ మీద ఏమి కేసులు ఉన్నాయి. ఆన్లైన్ వెబ్ సైట్ లో పార్టీను అమ్మకానికి పెట్టుకోవచ్చు అనే విధంగా పవన్ తయారయ్యాడు” అని మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు.
జగన్ పై సోనియాగాంధీ, చంద్రబాబు నాయుడు కలిసి కేసులు పెట్టించారని ఆరోపించారు. పవన్ పై కూడా ఏమైనా కనిపించని కేసులైమైనా ఉండవచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. ఢిల్లీ వెళ్లి భేషరతుగా కలిసి పనిచేస్తామని బీజేపీ నేతలకు చెప్పారన్నారు. అదే చొరవతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆ నేతలతో చెప్పి ముందుగా ప్రకటింపచేయాలని పవన్ కు సవాల్ విసిరారు.
ఇదిఇలా ఉంటే.. నిబంధనలు పాటించని బస్సులపై చర్యలు తప్పవని మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. అధిక చార్జీలు వసూళ్లు చేస్తే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ప్రైవేట్ యాజమాన్యంను వార్నింగ్ ఇచ్చారు. ప్రయాణికుల ఫిర్యాదుపై చర్యలు తీసుకున్నామని, జనవరి 2 నుంచి 16వ తేదీ వరకు 3,132 కేసులు నమోదు చేసినట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 552 బస్సులు సీజ్ చేశామని, సంక్రాంతికి 3 వేలకు పైగా స్పెషల్ బస్సులు నడిపామని పేర్ని నాని తెలిపారు. ప్రైవేట్ బస్సుల్లో అధికచార్జీలు వసూలు చేస్తే ఫిర్యాదు చేయాలని, పండగ పేరుతో దోపిడీ చేసిన ప్రైవేట్ ట్రావెల్స్పై కేసులు నమోదు చేస్తామన్నారు. నేటి నుంచి ఈ నెల 20 వరకు ప్రైవేట్ ట్రావెల్స్ పై మళ్లీ తనిఖీలు నిర్వహిస్తామని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.