అమరావతి: అమరావతి ప్రాంతంలోని రైతాంగం తొమ్మిది రోజులుగా తీవ్ర ఆందోళన చెందుతూ రోడ్డుపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ పక్కకు కన్నెత్తి చూడకపోవడం ఏమిటి? ఆయన ఎక్కడ ఉన్నారు? ఎటు వెళ్లారు? అన్న ప్రశ్నలు సామాన్య ప్రజానీకం నుండి వినిపిస్తున్నాయి. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇసుక సమస్య, ధాన్యం రైతుల సమస్య, ఉల్లి సమస్యలపై వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వాన్ని నిలదీసిన పవన్ కళ్యాణ్ ఈ పది రోజులుగా రాష్ట్రంలో కనిపించకుండా పోవడం ఏమిటి?. ఒక వేళ ఆయనకు వేరే పనులు ఉన్నప్పటికీ ఆ పార్టీ నేతలు ఏమైయ్యారు.
రాజధాని ప్రాంతంలో రైతులు ఆందోళనలు ప్రారంభించిన రెండవ రోజు మాత్రం జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఆ పార్టీ నేత కొణిదల నాగబాబు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రైతుల ఆందోళనకు సంఘీభావం తెలియజేశామని వారు చెప్పారు. ఆ తరువాత జనసేన నాయకులు ఎవ్వరూ రాజధాని ప్రాంత ఆందోళనలో పాలు పంచుకున్న దాఖలాలు లేవు.
‘అమరావతిలో పరిపాలన ఇంకా పూర్తిగా కుదురుకోలేదు, వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు ఇప్పుడిప్పుడే రాజధాని ప్రాంతానికి అలవాటుపడుతున్నారు. వారి పిల్లలు కూడా రాజధాని ప్రాంతంలో విద్యాలయాల్లో చేరారు. వాళ్లని మళ్లీ ఎగ్జిక్యూటివ్ రాజధాని అని మరో చోటికి వెళ్లిపోమంటే ఏలా?’ అని ఈ నెల 17న పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఆ తరువాత రాజధాని విషయంపై జిఎన్ రావు కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన తర్వాత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో అయోమయం, గందరగోళం నెలకొందనీ, ఈ పరిస్థితి శ్రేయస్కరం కాదనీ పేర్కొన్నారు. జిఎన్ రావు కమిటీ నివేదికపై మంత్రివర్గ నిర్ణయం తరువాత జనసేన రాజకీయ వ్యవహారాల కమిటిలో దానిపై చర్చించి పార్టీ నిర్ణయాన్ని ప్రజల ముందు ఉంచుతామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా రాజధాని విశాఖ తరలింపు ఖాయమన్నట్లుగా అధికార పార్టీ నేతల ప్రకటనలు చేస్తుండటం, అందుకు అనుగుణంగా భీమిలిలో పరిపాలనా రాజధాని ఏర్పాటు కానుందంటూ వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి బాహాటంగా ప్రకటించిన నేపథ్యంలోనూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గానీ ఆ పార్టీ నేతలు గానీ స్పందించకపోవడంపై ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.