అమరావతి: రాజధాని అమరావతి ఆందోళనల నేపథ్యంలో మరో రైతు గుండె ఆగింది. ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి అమరావతి ప్రాంతంలో ప్రభుత్వానికి భూములు ఇచ్చిన రైతులు తీవ్ర ఆందోళనలు చెందుతున్నారు. రాజధాని తరలి పోతుందన్న మానసిక ఆందోళనతో 50 రోజుల వ్యవధిలో సుమారు 20 మంది మృతి చెందారు. వీరిలో ఎక్కువ మంది నిత్యం రిలే దీక్షలో పాల్గొంటున్నవారే కావడం గమనార్హం. తాజాగా తుళ్లూరు గ్రామానికి చెందిన కంచర్ల చంద్రం (43) మృతి చెందాడు. చంద్రం తనకున్న 31 సెంట్ల అసైన్డ్ భూమిని రాజధాని కోసం ఇచ్చారు. గత కొన్ని రోజులుగా రాజధాని ఉద్యమంలో చంద్రం చురుగ్గా పాల్గొంటున్నారు. రాజధాని తరలిపోతుందన్న మనస్తాపంతో చంద్రం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని రైతులు, మహిళలు చేసున్న ఆందోళనలు 55వ రోజుకు చేరుకున్నాయి.