అమరావతి: ఏపీ రాజధానిపై కీలక నిర్ణయం తీసుకునేందుకు సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయ్యింది. నవ్యాంధ్ర రాజధానికి సంబంధించి జీఎన్ రావు కమిటీ సమర్పించిన నివేదికపై ఈ సమావేశంలో నిశితంగా చర్చిస్తున్నారు. రాజధాని ప్రాంతం రైతుల్లో నెలకొన్న ఆందోళనను చల్లార్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపైనా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో రాజధానిపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనున్నది. మూడు రాజధానులపై కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ? అనేదానిపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎక్కడ చూసినా ప్రజలు మంత్రివర్గ సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాలపైనే చర్చించుకుంటున్నారు. అమరావతి విషయంలో ఏం జరగబోతోంది? క్యాబినెట్ నిర్ణయం ఎలా ఉంటుంది? అనేదానిపై సర్వత్రా టెన్షన్ నెలకొంది.
ఇప్పటికే మూడు రాజధానులపై సూత్ర ప్రాయంగా వెల్లడించిన ఏపీ ప్రభుత్వం.. ఆ దిశగా అడుగులు వేస్తుందా? లేక ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందా? అన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. జీఎన్ రావు కమిటీ నివేదికను మంత్రివర్గం ఆమోదిస్తే మాత్రం అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో శాశ్వత హైకోర్టు ఏర్పాటుకు ప్రకటన చేసే అవకాశం ఉంది. అదే సమయంలో అమరావతి రైతులకు భరోసాను ఇచ్చేలా జగన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని తెలుస్తోంది.