(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: మూడు రాజధానుల ప్రకటనను నిరసిస్తూ అమరావతి ప్రాంతంలో రైతులు, మహిళలు, యువత నిర్వహిస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. మందడంలో మహాధర్నాను కొనసాగిస్తున్నారు. మూడు రాజధానులు వద్దు, అమరావతే ముద్దు అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మరో పక్క వెలగపూడిలో రైతులు, మహిళలు, చిన్నారులు రిలే నిరాహార దీక్షకు కూర్చున్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు రిలే దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలుపుతున్నారు. పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, సిఆర్డిఏ కమిషనర్లకు రైతులు లేఖలు రాశారు. తామంతా భూములు ఇచ్చిన రైతులమని, పెయిడ్ ఆర్టిస్టులం కాదని తమ ఆధార్ నంబర్లు జత చేసి లేఖలు ప్రదర్శించారు. నేడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దీక్షా శిబిరాలను సందర్శంచి రైతులకు సంఘీభావం తెలియజేయనున్నారు. మరో పక్క మోది, అమిత్ షా మాస్కులతో యువత వ్యాయామం చేస్తూ నిరసన తెలియజేయగా, పలువురు రైతులు జలదీక్షతో నిరసన తెలియజేశారు.
రాజధాని ప్రాంతంలో నిర్వహిస్తున్న ఆందోళనకు మద్దతుగా కంచికచర్ల మండలం మొగులూరు గ్రామంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. గ్రామంలోని సెంటర్లో రైతులు రిలే దీక్షలు చేపట్టారు. రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలనీ, అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ నినాదాలు చేశారు.