అమరావతి: ఏపి రాజధాని అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించనుంది అన్నది రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతోంది. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అమరావతి రాజధాని ప్రాంత రైతుల ఆందోళనకు సంపూర్ణ మద్దతు తెలియజేయడంతో పాటు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళతానని కూడా హామీ ఇచ్చారు. రాజధాని ప్రాంత రైతాంగం కేంద్రంలోని బిజెపిపై గంపెడాశతో ఉంది. సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదియే రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసినందున ఆయన న్యాయం చేస్తారని ఆశాభావంతో రైతులు ఉన్నారు.
మరో పక్క రాష్ట్రానికి చెందిన బిజెపి రాజ్యసభ సభ్యులు రాజధాని విషయంలో భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మాత్రం అమరావతిలోనే రాజధాని ఉంటుందనీ, మార్చడం సాధ్యపడదనీ అంటున్నారు. రాజధాని ఏర్పాటు అంశం రాష్ట్రానికి సంబంధించిందనీ, కేంద్రానికి సంబంధం లేదనీ అదే పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నర్శింహరావు పేర్కొంటుండగా టిజి వెంకటేష్, సిఎం రమేష్లు రాయలసీమకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఈ విషయంపై బిజెపి అధిష్టానం ఇంత వరకూ నోరుమెదపలేదు.
ఈ పరిస్థితుల్లో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కేంద్రంలోని పెద్దలను ఒప్పించి రాజధానికి అనుకూలంగా ప్రకటన విడుదల చేయించగలరా? లేదా?, రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర పరిధిలోనిది కావడంతో కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకుంటుందా, చేసుకోదా అన్న విషయాలపై వేచి చూడాల్సిందే. మరో పక్క అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ రాష్ట్ర బిజెపి పిలుపు మేరకు మండల కేంద్రాల్లో ఆ పార్టీ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించి తహశీల్దార్ కార్యాలయాల్లో వినతి పత్రాలను సమర్పిస్తున్నారు.