అమరావతి: రాజధాని ఏర్పాటుకై రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమిస్తూ విడుదల చేసిన జివో నెం.585ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాజధాని రైతుల పరిరక్షణ సమితి పేరుతో న్యాయవాది అంబటి సుధాకర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
రాజధాని నిర్మాణం కోసం చట్టబద్ధంగా రైతుల భూములు తీసుకుని ఇప్పుడు మళ్లీ నిపుణుల కమిటీ వేయడం సరికాదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. వెంటనే కమిటీ ఏర్పాటు జీవోను రద్దు చేయాలని కోరారు. దీనిపై హైకోర్టు ప్రతివాదులకు నోటీసు జారీ చేస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి మూడవ తేదీకి వాయిదా వేసింది.
ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ శాఖ ఫిబ్రవరి మూడవ తేదీలోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు నోటీసులో పేర్కొంది.
అమరావతిని కేవలం లెజిస్లేచర్ క్యాపిటల్గా మాత్రమే కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో రాజధానికి లాండ్ పూలింగ్లో భూములిచ్చిన రైతులు ఆందోళన బాటపట్టిన సంగతి తెలిసిందే. రాజధాని నిర్మాణం అంటూ తమ దగ్గర భూములు తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు మరో చోటికి రాజధానిని ఎలా తరలిస్తారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే దీనిపై హైకోర్టును ఆశ్రయించారు.