న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను దుర్యోధనుడు, దుశ్వాసనులతో పోల్చారు మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా. దేశంలో అత్యంత ప్రమాదకరమైన ‘తుక్డే తుక్డే’ గ్యాంగులో కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారని ఆయన అన్నారు. అందులో ఒకరు దుర్యోధనుడు, మరొకరు దుశ్శాసనుడని.. వారిద్దరూ బీజేపీలోనే ఉన్నారని తెలిపారు. వాళ్లిద్దరి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఉద్దేశించి యశ్వంత్ సిన్హా పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్ఆర్సీ, సీఏఏపై దేశ వ్యాప్తంగా చెలరేగుతున్న నిరసనలను ఉదహరిస్తూనే యశ్వంత్ సిన్హా విమర్శలు చేశారు. కురుక్షేత్ర యుద్దానికి కారణమైన దుర్యోదన, దుశ్వాసనులతో మోదీ, అమిత్ షాలని పోల్చడం గమనార్హం.
The most dangerous tukde tukde gang in India consists of only two people, Duryodhan and Dusshashan. They are both in BJP. Beware of them.
— Yashwant Sinha (@YashwantSinha) December 27, 2019
దేశంలో ఎన్ఆర్సీ, సీఏఏలపై కాంగ్రెస్, ‘తుక్డే తుక్డే’ గ్యాంగ్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత వారం ఢిల్లీ ప్రజలను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతృత్వంలోని ‘తుక్డే తుక్డే’ గ్యాంగ్ కు బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఢిల్లీలో నెలకొన్న ఆందోళనలకు వారే కారణమని మండిపడ్డారు. పౌరసత్వ చట్టాలకు వ్యతిరేకంగా పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలకు వీరే బాధ్యులని అమిత్ షా ఆరోపించారు. బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్న విపక్షాలపై అమిత్ షా ‘తుక్డే తుక్డే’ గ్యాంగ్ అని విమర్శలు సంధిస్తున్న నేపథ్యంలోనే యశ్వంత్ సిన్హా బీజేపీ అగ్రనాయకత్వంపై విమర్శలు గుప్పించారు.