(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. జగన్ ప్రటకనపై విపక్ష తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తుంటే… పార్టీకి చెందిన కొందరు నేతలు మాత్రం సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్వాగతించగా.. తాజాగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కొండ్రు మురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు చేస్తామంటే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. కొద్దిమంది రైతుల కోసం టీడీపీ నేతలు మాట్లాడం సరికాదని.. సీఎం నిర్ణయాన్ని పార్టీలకు అతీతంగా అందరూ స్వాగతించాలన్నారు. ఎంతోకాలంగా ఉత్తరాంధ్ర వెనుకబడ్డ ప్రాంతమని.. ఉత్తరాంధ్రకు అడ్మినిస్ట్రేటివ్ రాజధాని రావడం సంతోషకరం తెలిపారు. ఓ న్యూస్ ఛానల్ డిస్కషన్లో కొండ్రు ఈ వ్యాఖ్యలు చేశారు.
జగన్ ప్రకటనపై టీడీపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం, టీడీపీ అధిష్టానం నిర్ణయానికి భిన్నంగా కొందరు నేతలు సమర్ధిస్తూ ప్రకటనలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మాజీ మంత్రులు గంటా, కేఈ కృష్ణమూర్తిలు ప్రభుత్వ ప్రకటనను స్వాగతించారు. సహజ సిద్ధమైన సముద్ర తీర నగరం విశాఖను పరిపాలనా రాజధాని చేయడం మంచి నిర్ణయం అని గంటా అభిప్రాయపడ్డారు. ఇటు మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని స్వాగతించారు. తాను మొదటి నుంచి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుకున్నానని.. వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధికి అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.
ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చని అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలు జ్యుడిషియరీ కేపిటల్ ఉండొచ్చన్నారు. అయితే రాజధానిపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకుంటామన్నారు.