అమరావతి: ఉల్లి సమస్యలపై చర్చించాలని టిడిపి నేతలు అసెంబ్లీలో పట్టుబట్టడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఉల్లి సమస్యలపై చర్చించాలని టిడిపి వాయిదా తీర్మానం ఇవ్వగా స్పీకర్ తమ్మినేని సీతారాం ఆ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు.ఈ క్రమంలో ఉల్లి సమస్యపై చర్చించాల్సిందేనంటూ టిడిపి ఎమ్మెల్యేలు పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. స్పీకర్కు ఎమ్మెల్యే జోగేశ్వరరావు ఉల్లిపాయల గిఫ్ట్ ప్యాక్ ఇచ్చారు. ఉల్లి సమస్యపై గందరగోళం కొనసాగుతుండగానే సిఎం జగన్మోహనరెడ్డి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబజారుల్లో కేజీ 25 రూపాయల చొప్పునే అందిస్తున్నామని తెలియజేశారు.ఇప్పటి వరకూ 36,536 క్వింటాళ్ల ఉల్లి వివిధ ప్రాంతాల నుండి కొనుగోలు చేసి ప్రజలకు తక్కువ ధరకు అందించామని జగన్ చెప్పారు.ఉల్లిపై మాట్లాడే హక్కు టిడిపికి లేదని జగన్ అన్నారు. ఉల్లి సమస్యపై తరువాత చర్చించేందుకు సిద్ధమేనని పేర్కొన్నారు.
ఈ గందరగోళ పరిస్థితి కొనసాగుతుండగానే మహిళల భద్రతకు సంబంధించిన బిల్లును హోం మంత్రి మేకతోటి సుచరిత అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అత్యాచార ఘటనలను నిరోధించేందుకు ఇలాంటి చట్టం అవసరమని సిఎం పేర్కొన్నారు. ముఖ్యమైన అంశంపై చర్చ జరుగుతుంటే టిడిపి సభ్యులు ప్రవర్తన బాగాలేదని జగన్ అన్నారు. హోం మంత్రి ప్రసంగిస్తుండగా టిడిపి సభ్యులు అడ్డుతగిలారు. హోంమంత్రి మాట్లాడుతుంటే అడ్డుకుంటారా అంటూ జగన్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన మాట్లాడుతూ టిడిపి ఎమ్మెల్యేలు ఉల్లిపాయల గిఫ్ట్ ప్యాక్ను స్పీకర్కు పంపి ఇలా అవమానిస్తారా అంటూ నిలదీశారు. ఉల్లిపై చర్చ జరపాలని టిడిపి సభ్యులు నినాదాలు చేస్తూ నిరసన కొనసాగిస్తున్నా మహిళల భద్రత అంశంపై సభ్యుల ప్రసంగాలు కొనసాగాయి.