హైదరాబాద్: దిశ కేసులో నిందితులను ఎన్కౌంటర్ వ్యవహారం లాయర్ల మధ్య వివాదానికి కారణమైంది. సోమవారం తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో వాగ్వాదానికి దిగారు లాయర్లు. ఎన్కౌంటర్కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాదులపై పలువురు లాయర్లు నిరసన వ్యక్తం చేశారు. ఎన్కౌంటర్పై మహిళా సంఘాల తరపు లాయర్లు, మరోవర్గం లాయర్ల మధ్య గొడవ జరిగింది. దిశ నిందితుల ఎన్కౌంటర్… ఫేక్ ఎన్కౌంటర్ ఎలా అవుతుందంటూ.. మహిళా సంఘాల తరపు లాయర్లను మరోవర్గం న్యాయవాదులు నిలదీశారు. అయితే, తమ వాదనలు వినిపిస్తామంటూ మహిళా సంఘాల తరపు లాయర్లు స్పష్టం చేశారు. ఇక, హైకోర్టు జోక్యం చేసుకోవడంతో అక్కడి నుంచి ఇరువర్గాలకు చెందిన న్యాయవాదులు వెళ్లిపోయారు.
దిశ కేసులో నిందితులను న్కౌంటర్ చేయడంపై ఓవైపు ప్రశంసలు.. మరోవైపు విమర్శలు వస్తున్నాయి. ఈ ఎన్కౌంటర్పై మహిళా సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. హైదరాబాద్ శివార్లలో వెటర్నరీ డాక్టర్పై అత్యాచారం, హత్యకు పాల్పడిన నలుగురు నిందితులు డిసెంబర్ 6వ తేదీ తెల్లవారుజామున ఎన్కౌంటర్లో చనిపోయారని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ చెప్పారు. ఈ నలుగురి మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ మృతదేహాలకు ఈనెల 9వ తేదీ సోమవారం రాత్రి 8 గంటల వరకు అంత్యక్రియలు నిర్వహించరాదని తెలంగాణ హైకోర్టు 7వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకూ మృతదేహాలను మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోనే భద్రపరచాలని ఆదేశించింది.
ఎదురుకాల్పులపై పలు మహిళా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశాయి. కస్టడీలో ఉన్న నిందితులు పోలీసుల చేతుల్లో మరణించడంపై ప్రశ్నలు లేవనెత్తాయి. ఫోరెన్సిక్ నిపుణుల చేత పోస్టుమార్టం నిర్వహించాలని, ఈ ప్రక్రియను వీడియో తీయాలని విజ్ఞప్తి చేశాయి. దీనికి హైకోర్టు స్పందిస్తూ.. వీడియో చిత్రీకరణతో పోస్టు మార్టం నిర్వహించాలని, ఆ వీడియోను శ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు అందించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.