(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: ఏపి రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు 23వ రోజుకు చేరాయి. తుళ్లూరు, వెలగపూడి, మందడం తదితర గ్రామాల్లో గురువారం ఉదయం నుండే రైతులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో రోడ్డుకుపైకి వచ్చి ఆందోళనలో పాల్గొంటున్నారు. తుళ్లూరు కొనసాగుతున్న దీక్షలకు సంఘీభావంగా దళిత జెఎసి నాయకులు ఒక రోజు దీక్షకు దిగారు.
మూడు రాజధానులు వద్దు, అమరావతే ముద్దు, సేవ్ అమరావతి అంటూ రైతులు నినాదాలు నినదించారు. మందడంలో రైతులు రోడ్డుపైనే షామియానాలు వేసుకొని దీక్షను కొనసాగిస్తున్నారు. జాతీయ జండా, మోది ఫ్లెక్సీలతో పలువురు ధర్నాలో పాల్గొన్నారు.
పలువురు రైతులు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేకపోతే శ్రమదానంతో రాజధాని నిర్మించుకుంటామనీ, రాజధాని ఇక్కడే కొనసాగించాలనీ డిమాండ్ చేశారు.టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు ఐనవోలు, తుళ్లూరు గ్రామంలో పర్యటించనున్నారు. దీక్షా శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలుపనున్నారు.