(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: ఒకింత భిన్నస్వరంతో ఇటీవల సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన వైసిపి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి వార్తలకు ఎక్కారు. రాష్ట్రంలో తీవ్రమైన చర్చకు దారి తీసిన రాజధాని మార్పుపై ఆయన స్పందించారు. ఈసారి కూడా ఆయన భిన్నంగానే వ్యాఖ్యానించారు. జగన్ నిర్ణయానికి క్యాబినెట్ ఆమోదంతో పాటు అసెంబ్లీ ఆమోదం కూడా కావాలని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజధాని మార్పుపై అమరావతి ప్రాంత రైతులకు ఆందోళన కలగడం సహజమనీ, వారి ఆందోళనను తప్పు పట్టడం న్యాయం కాదనీ మంగళవారం తన సొంత జిల్లాకు వచ్చిన రాజు అన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఇది అంటూనే, అమరావతి రైతులకు న్యాయం జరుగుతుందని తాను భావిస్తున్నట్లు రాజు పేర్కొన్నారు.
సిఎం నిర్ణయానికి కేబినెట్ ఆమోదం, అసెంబ్లీ ఆమోదం రావాల్సిఉంది కాబట్టి మాకు న్యాయం చేయండని రాజధాని రైతులు కోరడం తప్పేంకాదని నా వ్యక్తిగత అభిప్రాయం. అమరావతి రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నా అభిప్రాయం అని రఘరామకృష్ణంరాజు పేర్కొన్నారు. రాజధానిపై ఇంకా పూర్తిగా క్లారిటి రాలేదనీ, క్యాబినెట్లో ఆమోదం, అసెంబ్లీ ఆమోదం పొందితే కానీ రాజధాని మార్పుపై స్పష్టత రాదనీ ఆయన అన్నారు.
అమరావతి నుంచి రాజధాని పూర్తిగా తరలించడం లేదని దానితో పాటు విశాఖ కూడా రాజధానిగా ఉంటుంది అని చెబుతున్నారు. అమరావతి రాజధాని రైతులకు అన్యాయం జరగదనే నేను భావిస్తున్నా. ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయి. అమరావతి అభివృద్ధి ఏ మాత్రం తగ్గదు అని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు.