(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల వ్యవహారంపై దుమారం కొనసాగుతోంది. అమరావతి నుంచి రాజధానిని తరలించొద్దని ఆప్రాంత రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అయితే, మూడు రాజధానుల అంశంపై తెలంగాణ ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ట్విట్టర్లో #AskKTR పేరుతో నెటిజన్లతో చర్చాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ ఏపీలో మూడు రాజధానుల అంశంపై కేటీఆర్ అభిప్రాయాన్ని చెప్పాలని కోరారు. ‘మీరు తెలంగాణకు చెందిన వారు కాదని కొన్ని సెకన్ల పాటు మర్చిపోండి. ఓ భారతీయ పౌరుడిగా ఏపీలో మూడు రాజధానుల అంశం మీద మీ సమాధానం చెప్పండి. రాజధాని నగరం, హైకోర్టు ఏర్పాటు అంటే అభివృద్ధేనా?’ అని నెటిజన్ ప్రశ్నించారు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ.. ‘ఆ తీర్పు చెప్పాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. నేను కాదు’ అని పేర్కొన్నారు.
Well, that’s up to the people of AP to judge. Not me https://t.co/7vB1WqfYZD
— KTR (@KTRTRS) December 29, 2019
ఏపీ సీఎం జగన్ ఆరు నెలల పాలన గురించి ఒక్క ముక్కలో చెప్పండి అని అడిగిన ప్రశ్నకు కేటీఆర్ బదులిస్తూ, జగన్ పరిపాలన బాగుందని భావిస్తున్నట్టు చెప్పారు.
https://twitter.com/KTRTRS/status/1211233543520604160
ఏపీలో రెండు రాజకీయపార్టీలు పరస్పరం శత్రుత్వ ధోరణితో ఉండటంతో విసిగిపోయామని, తమ రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నామని ఇంకో నెటిజన్ కోరగా.. ఆ నెటిజన్ కు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సరైన నాయకత్వం లేదన్న వ్యాఖ్యలు విన్నానని, ఇప్పుడు ఏపీ నుంచి ఈ తరహా వ్యాఖ్యలు వింటున్నానని చెప్పారు. ఇది కేసీఆర్ నాయకత్వానికి వచ్చిన గుర్తింపు అని కొనియాడారు.
Many thanks. I remember a time before formation of Telangana state when I heard the comments that Telangana would suffer for lack of leadership. Now when I see such comments from AP, it’s heartwarming acknowledgement for leadership of KCR Garu https://t.co/kTJEK2CrVN
— KTR (@KTRTRS) December 29, 2019
కాగా, ఏపీకి మూడు రాజధానుల అంశంపై తెలంగాణకు చెందిన పలువురు నేతలు ఇప్పటికే స్పందించిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనకు మద్దతు పలికిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు.. తెలంగాణలోనూ మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. అయితే, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. మూడు రాజధానుల వల్ల ఏ ప్రయోజనమూ లేదని ఆయన అన్నారు. రాజధాని వికేంద్రీకరణ వల్ల నష్టమే తప్ప లాభం ఉందని తెలిపారు. ప్రజా ధనం భారీగా వృథా అవుతుందని అభిప్రాయపడ్డారు.