అమరావతి: రాజధాని గ్రామాలైన మందడం, తుళ్లూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.శుక్రవారం ఉద్దండరాయునిపాలెం నుంచి విజయవాడ దుర్గగుడికి రైతులు పాదయాత్ర తలపెట్టారు. కనకదుర్గమ్మకు సారె, నైవేద్యం సమర్పించేందుకు పాదయాత్రగా వెళ్లేందుకు సిద్ధమైన రైతులు, మహిళలను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పోలీసులు, రైతుల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. రైతులను లాఠీలతో చెదరగొట్టేందుకు పోలీసులు యత్నించారు. లాఠీచార్జ్లో పలువురు మహిళా రైతులకు గాయాలయ్యాయి.
రాజధానిని తరలించవద్దంటూ రైతులు చేపట్టిన ఆందోళనలు 24వ రోజుకు చేరుకున్నాయి. రాజధాని అమరావతికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో పూజలు నిర్వహించి అనంతరం పొంగళ్లను నైవేద్యంగా అమ్మవారికి సమర్పించాలని రైతులు నిర్ణయించారు. దీంతో రాజధాని గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు. పలువురు రైతు నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.
విజయవాడలో పాదయాత్రకు అనుమతి లేదని… 144 సెక్షన్, 30 యాక్ట్ అమలులో ఉన్నందున ఎవరూ బయటకు రావొద్దని పోలీసులు తెలిపారు. 29 గ్రామాల ప్రధాన కూడళ్ళలో ముళ్ల కంచెల ఫెన్సింగ్ను ఏర్పాటు చేశారు. మందడం, వెలగపూడి గ్రామాల్లో రైతుల బయటకు రాకుండా భారీగా పోలీసుల బలగాలు మోహరించాయి. తుళ్లూరులో పది మంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తుళ్లూరు రహదారిపై ధర్నా, టెంట్ వేయవద్దని ఆదేశించారు. పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నప్పటికీ పాదయాత్ర చేసి తీరుతామని రైతులు, రైతు కూలీలు స్పష్టం చేశారు. పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారని రైతులు మండిపడుతున్నారు.
మరోవైపు రాజధాని రైతుల ర్యాలీలో పాల్గొనకుండా టీడీపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని చందు సహా పలువురిని గృహ నిర్బంధం చేశారు. విజయవాడ బెంజ్ సర్కిల్లోని అమరావతి జేఏసీ ఆఫీసుకు తాళాలు వేశారు. జేఏసీ ఆఫీసు గేటు ఎదుట పోలీసులు వాహనాలను అడ్డుగా పెట్టారు. ఇంతవరకూ విపక్షాల నిరసనలకు వేదికగా ఉన్న వేదిక కల్యాణ మండపంనే జేఏసీ కేంద్ర కార్యాలయంగా వినియోగిస్తోంది. ఈ నేపథ్యంలో పటమట పోలీసులు వచ్చి ఫంక్షన్ హాల్ కు తాళం వేసి, యజమాని చెన్నుపాటి వజీర్ కు నోటీసులు ఇచ్చారు.