అమరావతి: అమరావతి పరిధిలో శనివారం ఉదయం నుంచి బంద్ వాతావరణం నడుస్తోంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆందోళన చేస్తున్న మహిళలపై పోలీసులు దౌర్జన్యానికి నిరసనగా జేఏసీ పిలుపుతో శనివారం బంద్ పాటిస్తున్నారు. రైతులు ఉదయాన్నే రోడ్లపైకి చేరుకుని నిరసనకు దిగారు. దీంతో మందడంలో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బందోబస్తుకు వచ్చిన పోలీసులకు నీళ్లు కూడా ఇవ్వకూడదని గ్రామస్థులు నిర్ణయించారు. గ్రామంలోని దుకాణాల వద్ద పోలీసులు కూర్చోవడానికి కూడా వీల్లేదని రైతులు స్పష్టం చేశారు. గ్రామంలోకి వెళ్లకుండా పోలీసు వాహనాలను అడ్డుకుని వెనక్కి పంపించారు. దీంతో పోలీసులు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. బంద్ చేపట్టిన రైతులు పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరుకోవడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. అంతేకాదు కొందరు రైతులు పోలీసుల కాళ్లు పట్టుకున్నారు. తమ గ్రామాల్లోకి రావొద్దని కోరారు.
మరోవైపు రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఆందోళనలు అమరావతిలో కొనసాగుతున్నాయి. 18వరోజు ఈ నిరసనల్ని మరింత ఉధృతం చేశారు. రాజధానిలోని అన్ని గ్రామాల్లో దీక్షలతో పాటూ ర్యాలీలు, ధర్నాలు కొనసాగుతున్నాయి. తమ పోరును మరింత ఉద్ధృతం చేస్తామని రాజధాని అమరావతి జేఏసీ నేతలు స్పష్టం చేశారు.
ఇది ఇలాఉంటే.. శుక్రవారం సకల జన సమ్మెలో భాగంగా మందడంలో ఆందోళనకు దిగిన మహిళలను పోలీసులు విచక్షణ మరిచి విరుచుకుపడ్డారు. మహిళలను బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించారు. దీంతో మందడంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడిన సంగతి తెలిసిందే. రోడ్డుపై ఆందోళనలు చేస్తున్న మహిళల్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు దురుసుగా ప్రవర్తించారని రైతులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై పోలీసులకు మహిళలు ఫిర్యాదు చేయగా.. టీడీపీ నేతలు జాతీయ మానహహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు నిరసనగానే మందడంలో రైతులు బంద్ పాటిస్తున్నారు.