విశాఖ: మాజీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఇవ్వాల్సింది తన గాజులు కాదని, ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా చంద్రబాబు కొట్టేసిన భూములని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. గురువారం విశాఖలో బొత్స మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తన పాలనలో ఏపీని 25 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని విమర్శించారు. రాష్ట్ర విభజన తర్వాత ఒక సీనియర్ ను, అనుభవమున్న వ్యక్తికి అవకాశం ఇచ్చారని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఆర్థిక పరిస్థితి క్రమంగా క్షీణించిందన్నారు. చంద్రబాబు లక్ష తొంభై కోట్ల రూపాయలతో రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టేశారని మండిపడ్డారు. భువనేశ్వరి రైతుల వద్దకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. గాజులు కాదు.. తీసుకున్న భూములు తిరిగి ఇవ్వాలన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయ చరిత్ర అందరికీ తెలుసని, ఆయన రాజకీయ ఎదుగుదలకు దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి కారణమని తెలిపారు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు చంద్రబాబుకు వైఎస్సార్ అన్నివిధాలుగా మేలు చేశారని, ఆయన మంత్రి అవ్వడానికి కూడా కారణం వైఎస్సార్ అని గుర్తు చేశారు. అలాంటిది చంద్రబాబును చూసి వైఎస్సార్ భయపడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఎవరిని చూసి ఎవరు భయపడ్డారో అందరికీ తెలుసని, నాడు విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చింది చంద్రబాబు కాదా ? అని బొత్స సత్యనారాయణ నిలదీశారు.
రాజధాని అంశాలపై ఓ కమిటీని నియమించారని.. ఆ కమిటీ నివేదిక ఇవ్వాలి ఉందని తెలిపారు. నిపుణులు కమిటీ అసెంబ్లీని అమరావతిలో, సచివాలయం విశాఖలో పెట్టాలని సూచించినట్టు వెల్లడించారు. దేశంలో పెద్ద నగరంగా ఉన్న విశాఖను రాజధానిగా చేస్తే ముంబై స్థాయిలో అభివృద్ధి చెందుతుందని ఆ కమిటీ చెప్పిందని వివరించారు. విశాఖను రాజధాని చేస్తే మొదట చంద్రబాబు సామాజిక వర్గాల వారే ధనవంతులు అవుతారని, అయితే, సామాజిక వర్గాలు ప్రస్తావన చేయడం సరికాదని మంత్రి బొత్స పేర్కొన్నారు.
అమరావతి పర్యటన సందర్భంగా అమరావతి పరిరక్షణ సమితికి చంద్రబాబు భార్య భువనేశ్వరి తన చేతి గాజును విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. ఎర్రబాలెంలో రైతుల శిబిరాన్ని బుధవారం ఆమె సందర్శించారు. తనవంతు సాయంగా చేతి గాజును ఇచ్చారు. ఈ గాజును వేలం వేసి వచ్చిన సొమ్మును ఉద్యమానికి వాడాలని కోరారు.