అమరావతి: రాజధాని ప్రాంత రైతులను అరెస్టు చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పోలీసు చర్యలను తీవ్రంగా ఖండించారు. రైతుల అరెస్టుపై పార్టీ నేతలతో సోమవారం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజధాని నిర్మాణానికి భూములను త్యాగం చేసిన రైతులపైనే కేసులు పెడతారా అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటారా? అని చంద్రబాబు మండిపడ్డారు. రైతులపై హత్యాయత్నం అభియోగాలు పెట్టడాన్ని ఖండించారు. రైతుల ఆందోళనలను పోలీసులతో అణచివేయలేరని పేర్కొన్నారు. పోలీసులు రైతుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని తెలిపారు.
‘పోలీసులు పెట్టిన సెక్షన్లకు పొంతన ఉందా? రాజధానికి భూములు ఇచ్చిన రైతులను జైలుపాలు చేస్తారా? అర్ధరాత్రి ఇళ్ల గోడలు దూకి రైతులను అరెస్టు చేస్తారా? మహిళలను, వృద్ధులను భయభ్రాంతులకు గురి చేస్తారా? దొంగలు, గుండాల మాదిరిగా భూములిచ్చిన రైతులపై దాడులా..? రైతులపై ఇంత అమానుషమా? 33వేల ఎకరాలు అందించిన రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అంటారా ? 13 రోజులుగా వేలాది మంది రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా పట్టించుకోరా ? వెంకటపాలెం, నెక్కల్లు, మోదుగ లంకపాలెం, వెలగపూడికి చెందిన ఆరుగురు రైతుల అరెస్టులు అప్రజాస్వామికం. వేలాది పోలీసులను దించి రైతుల ఆందోళనలను అణిచేయలేరు’ అని చంద్రబాబు అన్నారు.
మరోవైపు మీడియాపై దాడి చేసిన కేసులో అరెస్టు చేసిన రైతులను ఆదివారం రాత్రి పోలీసులు మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రైతులపై పెట్టిన హత్యాయత్నం సెక్షన్లు సరికాదని న్యాయమూర్తి అన్నారు. హత్యాయత్నానికి ఆధారాలు ఏమున్నాయని పోలీసులను ప్రశ్నించారు.
కాగా, గత శుక్రవారం(డిసెంబర్ 27) తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో ఆందోళన చేస్తున్న రైతులు పెయిడ్ ఆర్టిస్టులన్న వ్యాఖ్యల నేపథ్యంలో కొన్ని టీవీ చానళ్ల రిపోర్టర్లపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి తుళ్లూరు పోలీసు స్టేషన్లో విజయవాడకు చెందిన నల్లమోతు దీప్తి పేరుతో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆరుగురు రైతులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆదివారం తెల్లవారుజామున గుంటూరు జిల్లా తెనాలి టూటౌన్ పోలీసులు రాజధాని ప్రాంతంలోని ఏడుగురు రైతులను అదుపులోకి తీసుకున్నారు. రైతుల ఇళ్ల గోడలు దూకి వెళ్లి మరీ పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఆరుగురిని తెనాలి తీసుకొచ్చినట్లు తెలియడంతో టీడీపీ నాయకుడు ఆలపాటి రాజా, బీజేపీ, సీపీఎం, సీపీఐ, జనసేన, కాంగ్రెస్ నాయకులు పోలీసు స్టేషన్ను చుట్టుముట్టారు. రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. ఆదివారం రాత్రి తెనాలిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించారు. రాత్రి 10.30 గంటలకు మంగళగిరి అదనపు జూనియర్ సివిల్ జడ్జి వీవీఎన్వీ లక్ష్మి ఇంటి వద్ద హాజరుపరిచారు. వారిని 14 రోజులు రిమాండ్కు పంపుతూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.