హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న రాజధాని వివాదంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంత్రి కేటీఆర్ శుక్రవారం మీడియా సమావేశంలో చిట్ చాట్ చేశారు. అందులో భాగంగా ఏపీ రాజధాని అమరావతిపై ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణలో పది జిల్లాలను 33 జిల్లాలుగా విభజన చేశామన్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాక రాష్ట్రంలో కొంచం కూడా వ్యతిరేకత రాలేదన్నారు. కానీ ఏపీలో రాజధాని విషయంలో వ్యతిరేకత వస్తోందని, ఎందుకనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలో మూడు రాజధానులు ఉండవచ్చునని సీఎం జగన్ ప్రకటన తర్వాత ఒక్కసారిగా విమర్శలు, ఆందోళనలు జరగుతున్నాయన్నారు. అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు పెద్ద ఎత్తు ఉద్యమాలు చేస్తున్నారన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 33 జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పడ్డాయని, ఎక్కడా చిన్న సంఘటన జరగకుండా కేసీఆర్ విజయవంతంగా పరిపాలన సాగిస్తున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇక బీజేపీతో జనసేన పొత్తుపై మీడియా ప్రశ్నించగా… ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏం చేస్తే మాకేంటీ ? అని ప్రశ్నించారు. ఆ విషయాలన్నింటినీ ఏపీ ప్రజలు చూసుకుంటారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
రాజధాని తరలింపు నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి ప్రాంత రైతలు గత నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి లాంటి పెద్ద పండగ వేడుకలకు కూడా దూరంగా ఉన్న రైతులు.. పండగ నాడూ ఆందోళన కొనసాగించారు. వీరికి రాష్ట్రంలోని విపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. అయితే, రాజధాని విషయంలో మాత్రం ప్రభుత్వం వెనక్కి తగ్గే అవకాశాలు కనిపించడం లేదు.