(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
కాంగ్రెస్లో బీసీలకు అన్యాయం జరుగుతోందా ? తెలంగాణ కాంగ్రెస్లో ఒకం వర్గమే రాజ్యమేలుతోందా ?కాంగ్రెస్ పార్టీలో కులాల ఆధిపత్యం తారాస్థాయికి చేరింది. తెలంగాణలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని బీసీ వర్గం నేతలు డిమాండ్ చేస్తుంటే.. కాంగ్రెస్ అంటేనే రెడ్ల పార్టీ.. వారికే ప్రయార్టీ అనే విధంగా నేతలు వ్యవహరిస్తున్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలైన వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య అలకబూనారు.
శనివారం పార్టీ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో పార్టీ నాయకులు రేవంత్రెడ్డి, షబ్బీర్ అలీ, జగ్గారెడ్డి, సీతక్క, శ్రీధర్బాబు, అంజన్కుమార్ తదితరులు గవర్నర్ను కలిశారు. మహిళలపై జరుగుతోన్న దాడులు, మద్యం నియంత్రణ, బెల్టుషాపులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో విచ్చల విడిగా అమ్ముతున్న మద్యం విక్రయాలే నేరాల పెరుగుదలకు కారణమని భట్టి గవర్నర్కు వివరించారు. అయితే, గవర్నర్ను కలిసేందుకు వెళ్లిన 21 మంది లిస్ట్లో తమ పేర్లు లేవని కాంగ్రెస్ సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు పేర్లు లేకపోవడంతో వారు అలకబూనారు.
గవర్నర్ను కలిసే నేతల జాబితాలో వారి పేర్లు లేకపోవడంతో రాజ్భవన్నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో కాంగ్రెస్ నాయకత్వంపై ఫైర్ అయ్యారు వీహెచ్. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫోన్ చేస్తేనే వచ్చా.. కానీ, జాబితాలో మా పేరు లేదు.. ఇది తమను అవమానపర్చడమేనంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు దగ్గర అయినప్పుడే తెలంగాణలో అధికారంలోకి వస్తామని వ్యాఖ్యానించారు.
నిజానికి కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని గత కొంత కాలంగా వీహెచ్ ఆరోపణలు చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, గౌరవం లేని చోట ఎందుకుండటం అంటూ కొందరు బీసీ లీడర్లలో కూడా ఓ ప్రశ్న లెవనెత్తారు. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం లేకపోవడం వల్లే చాలా మంది బీసీ సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీని వీడారనే ప్రచారం జరిగింది. మాజీ పీసీసీ చీఫ్ పొన్నాలకు కూడా పార్టీలో తగిన గౌరవం లభించం లేదని, వీహెచ్ లాంటి నేతలు పార్టీలో నామ్కే వాస్తే అన్నట్టు ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పరిస్థతి ఇలాగే కొనసాగితే… మరికొంత మంది బీసీ లీడర్లు.. గౌరవం దొరికే పార్టీలోకి వెళ్లిపోతారన్న ప్రచారం కూడా జరుగుతోంది.