అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతిలో వెల్లువెత్తుతున్న నిరసనలు నేటితో ఏడో రోజుకు చేరాయి. అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజలు మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తున్నారు. రైతులు, ప్రజలు నల్లదుస్తులు ధరించి తమ నిరసనను తెలుపుతున్నారు. విపక్ష పార్టీలతోపాటు ప్రజా సంఘాలు, విద్యార్థులు ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా నిలుస్తున్నారు. తుళ్లూరులో టెంట్లు వేసేందుకు ప్రయత్నించిన రైతులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
మందడం రహదారిపై ఆ ప్రాంత రైతులు ఆందోళన చేపట్టారు. రోడ్డుకు అడ్డంగా టెంటు వేసి ఆందోళన చేస్తున్నారు. దీంతో సచివాలయానికి రాకపోకలు నిలిచాయి. అర్ధనగ్న ప్రదర్శనతో రైతులు నిరసన తెలిపారు. రైతుల ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ మోహరించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. న్యాయవాదులు ‘చలో హైకోర్టు’కు పిలుపునిచ్చారు. ‘సేవ్ అమరావతి’ పేరిట సిద్ధార్థ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో ర్యాలీ నిర్వహించారు. సచివాలయం వైపు వెళ్లే ప్రతివాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. గుర్తింపు కార్డు ఉన్నవారినే మాత్రమే అనుమతిస్తున్నారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చస్తుంటే పోలీసులు నిర్బంధాలేంటని రైతులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలసి మొరపెట్టుకోవాలని రాజధాని రైతులు ఆయన అపాయింట్మెంట్ కోరారు. మరోవైపు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో రైతులు భేటీ కానున్నారు.