అమరావతి:మూడు రాజధానుల ప్రతిపాదన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికీ ఇష్టం లేదనీ, రాష్ట్ర భవిష్యత్తుకు ఇది చేటు తెస్తుందనీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. మందడంలో రైతుల ఆందోళనకు సిపిఎం నేతలు మద్దతు తెలుపుతూ వారిని కలిశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ మూడు రాజధానుల ప్రతిపాదను సిపిఎం వ్యతిరేకిస్తుందని చెప్పారు.రాజధాని రైతులతో సిఎం జగన్ వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
టిడిపి హయాంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్న వైసిపి ప్రభుత్వం అలా జరిగితే కేసులు పెట్టాలన్నారు. రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయాలని రైతులేమీ అడగలేదనీ, ప్రభుత్వమే వారిని ఒప్పించి భూములు తీసుకుందనీ అన్నారు. చేయని తప్పుకు రాజధాని రైతులను ప్రభుత్వం శిక్షిస్తోందని మధు అన్నారు. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు వేర్వేరు చోట్ల ఏర్పాటు చేస్తామంటూ గందరగోళం సృష్టిస్తున్నారనీ, రాష్ట్ర భవిష్యత్తుకు ఇది మంచిది కాదనీ అన్నారు. మూడు ప్రాంతాల్లో రాజధాని భూ ప్రపంచం మీద ఎక్కడా వినలేదని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో గందరగోళ పరిస్థితుల కారణంగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు భయపడుతున్నారని అన్నారు. పూలింగ్ విధానం మంచిది కాదనీ గతంలోనే తాము చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా మధు గుర్తు చేశారు. తిట్టుకోవడం వల్ల ఉపయోగం లేదనీ, పట్టుదలతో పోరాడాలనీ రైతులకు మధు పిలుపునిచ్చారు. రాజధాని రైతులపై పోలీసుల అణచివేతను ఆయన ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేలా పోరాటం చేయాలనీ, రైతుల పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామనీ మధు తెలిపారు. రాజధాని రైతుల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.