అమరావతి: జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ అధిష్ఠానం తనను అడిగే పరిస్థితి, తాను చెప్పే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. శనివారం మంగళగిరిలో జరిగిన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి గైర్హాజరైన రాపాక.. మంత్రి కొడాలి నానితో కలిసి ఎడ్ల పందేల పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తనకు ఏది మంచి అనిపిస్తే అదే చేస్తానని అన్నారు. ఈ రాష్ట్రం మళ్లీ విడిపోకూడదన్న ఉద్దేశంతోనే మూడు రాజధానుల అంశం గురించి సీఎం జగన్ ప్రతిపాదించారని తెలిపారు. అందుకే తాను మూడు రాజధానులకు మద్దతు తెలిపానని పేర్కొన్నారు. పార్టీలో తన అభిప్రాయం సొంతంగా ఉంటుందన్నారు. “ జనసేన పార్టీలో చర్చించే పరిస్థితి ఉండదు. వాళ్ల అభిప్రాయం వాళ్లు చెబుతారు నా అభిప్రాయం నేను చెబుతా. నాకు ఏది మంచి అని అనిపిస్తే అది చేస్తాను, పార్టీ నామీద ఎటువంటి బరువు బాధ్యతలు పెట్టలేదు. జనసేన పార్టీ అధిష్ఠానం తనను అడిగే పరిస్థితి, నేను చెప్పే పరిస్థితి లేదు” అని అన్నారు.
రాజధాని ప్రాంత రైతులను టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని, మూడు పంటలు పండే భూములను ఇవ్వమని వారు చెబితే బలవంతంగా వాటిని లాక్కున్నారని ఆరోపించారు. టీడీపీ వాళ్ల మాటలు నమ్మి ధర్నాలు చేస్తున్న రైతులు సీఎం జగన్ వద్దకు వెళ్లి వారి కష్టాలు చెప్పుకుంటే పరిష్కారం లభిస్తుందని రాపాక సూచించారు.
కాగా, జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి డుమ్మా కొట్టిన రాపాక.. మంత్రి కొడాలి నానితో కలిసి ఎడ్ల పందేల పోటీల్లో పాల్గొన్నారు. ఆయన ఉద్దేశపూర్వకంగానే పార్టీ సమావేశానికి రాలేదని నేతలు అంటున్నారు. రాపాక కొద్ది రోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. అంతక ముందు కూడా కాకినాడలో పవన్ కళ్యాణ్ చేసిన దీక్షకు కూడా వరప్రసాదరావు వెళ్లలేదు. అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో వెళ్లలేదని ఆయనే క్లారిటీ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు పార్టీ సమావేశానికి దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.
గత కొన్ని రోజులుగా రాపాక వరప్రసాద్ వైఎస్ జగన్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. పలుమార్లు ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారు. ఇంగ్లీష్ విద్య తోపాటు మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్ధించారు. అయితే ఈ రెండు అంశాల్లో పవన్ కళ్యాణ్ మాత్రం ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అధినేతకు బిన్నంగా రాపాక మాట్లాడుతుండటంతో జనసేన నాయకులు ఆగ్రహంతో ఉన్నారు. ఆయనను సస్పెండ్ చేయాలనీ కూడా డిమాండ్ చేస్తున్నారు. గతంలో జనసేన కూడా ఎమ్మెల్యే రాపాకకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని అనుకుంది. కానీ ఆ నిర్ణయాన్ని విరమించుకుంది. ఆయన వ్యవహరం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికార వైసీపీ నిర్ణయాలకు మద్దతు ఇస్తూ ఆపార్టీకి దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓవైపు పవన్ ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడుతుంటే.. పార్టీలోనే కొనసాగుతున్న రాపాక మాత్రం అనుకూల వ్యాఖ్యలు చేయడం.. ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతు పలకడం జనసేన పార్టీకి ఇబ్బందిగా మారింది.
video courtesy: tv99