శ్రీశైలం: ఏపీలో రాజధాని తరలింపుపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అమరావతికి మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు జోలపెట్టి విరాళాలు సేకరిస్తుంటే.. అటు వైసీపీ నేతలు మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీలు చేస్తున్నారు. ఇరు పార్టీలు పోటాపోటీగా రోడ్డెక్కుతున్నాయి. అమరావతి అంశంపై రెఫరెండం పెట్టాలని డిమాండ్ చేస్తున్న చంద్రబాబు.. వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని అన్నారు. ఈ క్రమంలో టీడీపీకి మంత్రి అవంతి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు.
విశాఖపట్నం రాజధాని అంశంపై టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. అమరావతి ఉద్యమం ప్రజల నుంచి రాలేదని.. స్వార్థ ప్రయోజనాలతో కృత్రిమంగా సృష్టించారని మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. సంక్రాంతి సందర్భంగా బుధవారం శ్రీశైలంలో దైవదర్శనం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. విశాఖ రాజధానిపై టీడీపీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే చంద్రబాబు వాదన సరైందేనని ఒప్పుకుంటామన్నారు. అమరావతిపై ప్రేమ ఉంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ గాజువాక నుంచి ఎందుకు పోటీ చేశారని ప్రశ్నించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే వైసీపీ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ ఎమ్మెల్యేలంతా ఆమోదించారని తెలిపారు. ఇతర ప్రాంతాల ప్రజలతో పోల్చితే గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకున్నవాళ్లని మంత్రి అభిప్రాయపడ్డారు.
రాజధాని అమరావతి మార్పు అంశంపై ప్రజాభిప్రాయం కోరాలంటూ గత కొద్దిరోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్ర అవంతి శ్రీనివాస్ తాజాగా టీడీపీ ఎమ్మెల్యేలే రాజీనామా చేసి ఉప ఎన్నిలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.