అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించిన మూడు రాజధానుల ఫార్ములాకు కేంద్ర మాజీ మంత్రి, మెగా స్టార్ డాక్టర్ కె చిరంజీవి మద్దతు పలికారు. అధికార, పరిపాలనా వికేంద్రీకరణతోనే సమతుల్యమైన, సమగ్రమైన అభివృద్ధి సాధ్యమవుతుందని చిరు పేర్కొన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తారన్న నమ్మకం తనకు ఉందని అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేస్తూ శివరామకృష్ణన్ కమిటి సిఫార్సులు చూసినా, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక చదివినా, తాజాగా జిఎన్ రావు కన్వీనర్గా ఉన్న నిపుణుల సిఫార్సులు చూసినా అధికార, పరిపాలనా వికేంద్రీకరణతోనే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యం అన్నది నిర్వివాదాంశంగా కనిపిస్తోందన్నారు.
అమరావతి – శాసన నిర్వహక, విశాఖ – కార్యనిర్వహక, కర్నూలు – న్యాయపాలనా రాజధానులుగా మార్చే ఆలోచనను అందరూ స్వాగతించాల్సిన సందర్భమిది అని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల అభివృద్ధి, మౌళిక సదుపాయాల కల్పనకు నిపుణుల కమిటీ సిఫార్సులు సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగించేవిలా ఉన్నాయని అన్నారు.
ఒక్క సారి గతాన్ని పరిశీలిస్తే 1956 తర్వాత అభివృద్ధి, పరిపాలన అంతా హైదరాబాద్లోనే కేంద్రీకృతమై, 2014లో రాష్ట్ర విభజన తర్వాత రిక్తహస్తాలతో అమరావతికి చేరుకున్న ఆంధ్రులు తిరిగి పాత తప్పులను పునరావృత్తం చేస్తే భావితరాలు క్షమించవని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మిగతా ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడం వల్ల ఆర్థిక, సామాజిక సమతుల్యత దెబ్బతిని అనేక సమస్యలు పేరుకుపోయాయన్నారు.ఇప్పటికే మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో అమరావతిలో ఇంకా లక్ష కోట్ల అప్పుతో రాజధాని నిర్మిస్తే వెనకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన అందరిలో ఉంటుందని ఆయన అన్నారు.
సాగు నీరు, తాగునీరు కూడా లేక, ఉపాధి అవకాశాలు లేక ఊళ్లు విడిచి వలస పోతున్న కూలీ బిడ్డల భవిష్యత్, నిరుద్యోగులకు ఈ మూడు రాజధానుల కాన్సెప్ట్ భద్రత ఇస్తుందన్న భరోసా కలుగుతోందని చిరు అభిప్రాయపడ్డారు. అమరావతిని నిర్మించడానికి ప్రతిపాదించిన లక్ష కోట్ల రూపాయలతో మూడు ప్రాంతాల్లో రాజధానులను నిర్మిస్తే ఎవరినీ విస్మరించలేదన్న భావన కలుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో రాజధాని రైతులలో నెలకొన్న భయాందోళనలు, అభద్రతాభావాన్ని తొలగించి వాళ్లు నష్టపోకుండా, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనీ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అపోహలు, అపార్ధాలు నివారించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుందన్న నమ్మకం ఉందన్నారు. ప్రజల ఆకాంక్షలు, సవాళ్లపై నిపుణుల కమిటీ విస్తృతంగా పరిశీలన చేసినట్లు భావిస్తున్నానని పేర్కొన్నారు.