(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
రాజధాని ప్రాంతంలో రైతులు ప్రజాస్వామ్య విధానంలో, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే ప్రభుత్వం రెచ్చగొడుతోందని జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ఆరోపించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని చెప్పారు. చినకాకాని వద్ద పోలీసులు వ్యవహరించిన తీరును పవన్ కల్యాణ్ తప్పుబట్టారు. ఈ మేరకు ట్విట్టర్ లో బహిరంగ ప్రకటన చేశారు. ఇలాంటి చర్యలతో ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం భావిస్తే అది పొరబాటే అవుతుందని పవన్ అభిప్రాయపడ్డారు. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో పరిపాలనా రాజధాని విషయంలో ఆ ప్రాంత వాసులు కూడా సంతృప్తిగా లేరని తెలిపారు. ఆందోళనలను అణచివేయాలని చూస్తే అంతకంటే బలంగా ఆందోళనలు చేపడతారని ప్రభుత్వం గ్రహించాలని హితవు పలికారు. వెనకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధిపై ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళిక లేదని విమర్శించారు. సీమ ప్రజలు విశాఖపట్టణానికి వెళ్లాలంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని అని అభిప్రాయపడ్డారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని పవన్ తెలిపారు.
రాజధాని మార్పు అనేది ఉద్యోగులకీ ఎన్నో ఇబ్బందులు సృష్టిస్తోందన్నారు. హైదరాబాద్ నుంచి అమరావతికి తరలి వెళ్లిన ఉద్యోగులు తమ పిల్లలను విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో చదివిస్తున్నారని తెలిపారు. ఇప్పుడిప్పుడే కుదురుకొంటున్నారని అన్నారు. వాళ్ళను మళ్లీ విశాఖకు పంపిస్తే వారి కుటుంబాలకి ఎన్నో వ్యయ ప్రయాసలకు లోనవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాలకు ఇది త్రిశంకు రాజధానిగా మారుతోందని, ఎవరికీ సంతృప్తి కలిగించటం లేదన్నారు. తాము భూములు త్యాగం చేసిన ప్రాంతంలోనే రాజధాని ఉండాలని అమరావతి ప్రాంతవాసులు కోరుతున్నారని చెప్పారు. రైతులు, మహిళలు అన్ని వర్గాల ప్రజలు రాజధాని ప్రాంతంలో చేసిన మహా పాదయాత్ర వారి ఆవేదనను అద్దంపట్టిందని పేర్కొన్నారు. వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తూ ఆందోళనలను అణచివేయాలని చూస్తే అంతకంటే బలంగా ఆందోళనలు చేపడతారని ప్రభుత్వాన్ని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
YCP is on the path of creating another ‘ Nandigram’. pic.twitter.com/13WjnqIiQy
— Pawan Kalyan (@PawanKalyan) January 7, 2020