అమరావతి: ఏపీలో అసెంబ్లీ సమావేశాల రెండో రోజు సభలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారం అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. సభలో ఎస్టీ, ఎస్సీ బిల్లును ప్రవేశ పెడతుండగా… టీడీపీ సభ్యులు అడ్డుతగిలారు. ‘జై అమరావతి’ అంటూ సభలో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ చెప్పిన వినకుండా తమ ఆందోళనను కనొసాగించారు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారం తీవ్ర అసహనానికి గురయ్యారు. టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ.. టీడీపీ సభ్యలు గొడవతో సభను నడపలేనని ప్రకటించిన తమ్మినేని.. వెంటనే స్పీకర్ ఛైర్ నుంచి లేచి సభ వెళ్లిపోయారు.
అసెంబ్లీ సమావేశాల తొలి రోజు అయిన సోమవారం(జనవరి 20) కూడా స్పీకర్ తమ్మినేని సభలో టీడీపీ సభ్యుల తీరుపై ఆగ్రహించారు. అమరావతిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని సీఎం జగన్ను విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రతిపక్ష టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణ జరపాలని కోరే హక్కు మీకు ఎవరిచ్చారని స్పీకర్ను టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతుండగా టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అడ్డు తగిలారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం సహనం కోల్పోయారు. “అచ్చెన్నాయుడు గారూ మీకు సెన్స్ ఉండాలి” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ తర్వాత సభలో సీఎం జగన్ మాట్లాడుతున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘జై అమరావతి.. జైజై అమరావతి. మూడు రాజధానులు వద్దు. ఒక్క రాజధాని ముద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పలుమార్లు వారిని కూర్చోవాలని సీఎం జగన్ కోరారు. అనంతరం పోడియం వద్ద గందరగోళం చేస్తున్న వారిని అక్కడి నుంచి పంపాలని స్పీకర్ను అభ్యర్థించారు. జగన్ విజ్ఞప్తి చేసిన తర్వాత కూడా టీడీపీ ఎమ్మెల్యేలు పోడియం వద్ద నినాదాలు చేస్తూనే ఉన్నారు. దీంతో వారిని మార్షల్స్ సాయంతో బయటకు పంపాలంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కోరారు. అనంతరం కొద్దిసేపటి తర్వాత 17 మంది ఎమ్మెల్యేలను సభ నుంచి ఒక్క రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.