అమరావతి: సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటనపై రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానికి తీసుకున్న 33వేల ఎకరాలను రైతులకు తిరిగి ఇచ్చేస్తున్నామని తెలిపారు. రాజధాని భూములు వెనక్కి ఇస్తామని ఎన్నికలకు ముందే జగన్ ప్రకటించారని గుర్తు చేశారు. అమరావతిలో నిర్మాణాలు తాత్కాలికమని చంద్రబాబు చెప్పారని.. తాము కూడా అమరావతిని తాత్కాలిక రాజధానిగానే భావించామన్నారు. మూడు రాజధానులు కాకపోతే ముప్పై రాజధానులు పెట్టుకుంటామని వ్యాఖ్యానించారు. రాజధానులతో కేంద్రానికి సంబంధం ఉండదని.. వాళ్ల నిధులు అవసరం లేదన్నారు. రాజధాని కోసం కేంద్రం అనుమతి అవసరం లేదని.. ఇది రాష్ట్ర పరిధిలోని విషయమని తెలిపారు. లెజిస్లేటివ్ కేపిటల్కు 300 ఎకరాలు సరిపోతుందని.. వేల ఎకరాలు అవసరం లేదని స్పష్టం చేశారు. రాజధానిని తరలించొద్దని అమరావతిలో ధర్నాలు చేసే వారంతా టీడీపీ కార్యకర్తలేనని పెద్దిరెడ్డి ఆరోపించారు. భూములు లాక్కొన్నవారే ఆందోళనలు చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్పై విచారణ కొనసాగుతోందన్నారు. తుళ్లూరు టీడీపీ నేతలు తక్కువ ధరకు భూములు కాజేశారని ఆరోపించారు. విశాఖలో వైసీపీ నేతల భూములు కొన్నారన్నది అవాస్తవమని.. ఇప్పటికే అక్కడ భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.
మరోవైపు మంత్రి పెద్దిరెడ్డిపై అమరావతి ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములను వెనక్కి ఇస్తామనే విషయం వైసీపీ మేనిఫెస్టోలో లేదని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ప్రకటనతో సగం చచ్చిపోయామని… పెద్దిరెడ్డి సహా ఇతర మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలతో తీవ్ర క్షోభను అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో నిరసన వ్యక్తం చేస్తున్నవారంతా టీడీపీవారే అంటూ పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా రైతులు తప్పుబట్టారు. అమరావతిలో ఏ పార్టీ జెండా లేదని, ఉన్నవన్నీ నల్ల జెండాలేనని చెప్పారు.