అమరావతి: రాజధాని అమరావతి పర్యటన సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు కాన్వాయ్పై జరిగిన దాడి ఘటన దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని టిడిపి నేత కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. పోలీసు అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తే ఏ సిట్ అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి టిడిపి నేతల బృందం మంగళవారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ తాము చెప్పిన విషయాలపై గవర్నర్ తీవ్రంగా స్పందించారని అన్నారు.
జరిగిన సంఘటనపై తాము కేంద్రానికి లేఖ రాస్తే ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిందన్నారు. ఈ సిట్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదన్నారు. డిజిపి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపైకి చెప్పులు, రాళ్లతో పాటు ఈ లాఠీ ఎలా వచ్చిందో చెప్పాలన్నారు. పోలీస్ చేసితో ఉండాల్సిన లాఠీ బస్సు మీదకు ఎవరు విసిరారు అని ప్రశ్నించారు. అక్కడ ఉన్న వైసిపి వారు పోలీసుల నుండి లాక్కొని విసిరారా లేక పోలీసులే వేసారో చెప్పాలన్నారు. ఆధారాలు లేకుండా తాము ఏమీ మాట్లాడటం లేదని అన్నారు.
కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగంతో యలమంచిలి పద్మ అనే మహిళను పోలీసులు అరెస్టు చేయడాన్ని అచ్చెన్నాయుడు తప్పుబట్టారు. గత నెల 26 రాజధానిపై స్పష్టత కోసం యర్రబాలెంలో రైతులు నిరసన ప్రదర్శన నిర్వహించారనీ, ఆ నిరసనలో పాల్గొన్న పద్మ మంత్రి కొడాలి నానిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిందనీ అన్నారు. పద్మ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమెను అరెస్టు చేసి పలు పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ఆమెను పోలీసులు తీసుకువెళ్లే ముందు కొడాలి నానిని పోలీసులు విచారణ చేయాల్సి ఉంటుందన్నారు. చంద్రబాబుపై ఇష్టానుసారంగా బూతులు మాట్లాడిన ఆయన్ను పోలీసులు ఎందుకు విచారణ చేయడం లేదని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.చంద్రబాబును దూషించినందుకు నానిని విచారించకుండా ఒక మహిళను తీసుకువెళ్లడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కక్షసాధింపే లక్ష్యంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
టిడిపి నేతల బృందంలో నిమ్మల రామానాయుడు, గద్దె రామ్మోహన్, వర్ల రామయ్య, పంచుమర్తి అనురాధ, మద్దాల గిరి, బచ్చుల అర్జునుడు తదితరులు ఉన్నారు.