తాడేపల్లి : రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల ఏర్పాటుకు అవకాశం ఉందన్న జగన్ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో గురువారం అంబటి మాట్లాడుతూ.. మూడు రాజధానులు ప్రతిపాదనపై అన్ని ప్రాంతాల నుంచి హర్షం వ్యక్తం అవుతోందని…ఇది మంచి కాన్సెప్ట్ అంటున్నారని తెలిపారు. అధికార వికేంద్రీకరతో అభివృద్ధి జరుగుతుందన్నారు. ఐదేళ్లలో చంద్రబాబు అమరావతి ప్రాంతాన్ని ఏ విధంగానూ అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. అమరావతిని సింగపూర్ చేస్తానని చంద్రబాబు చాలాసార్లు చెప్పినా.. దానిని అమలు చేయలేకపోమారని విమర్శించారు. మూడు రాజధానులు అంటే మూడు నగరాలు నిర్మించడం కాదని చెప్పారు. రాజధాని అంటే అధికార కేంద్రాన్ని ఏర్పాటు చేయడం మాత్రమే అని తెలిపారు. రాజధానులు ఏర్పాటైతే ఆటోమేటిక్గా అభివృద్ధి సాగుతుందని అభిప్రాయపడ్డారు. వికేంద్రీకరణ ద్వారా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ది సాధ్యమవుతుందని తెలిపారు. గతంలోనే ఇలాంటి ప్రయత్నం చేసివుంటే అభివృద్ధి సాధించి ఉండేవాళ్ళమని అంబటి చెప్పారు. తాము ఏమీ చేసినా చంద్రబాబుకు ఇష్టం ఉండదని అన్నారు. పవన్ కళ్యాణ్ తెలిసి మాట్లాడతాడో తెలియక మాట్లాడతాడో తెలియని పరిస్థితి నెలకొందని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు
అమరావతి అనేది స్కాం అని, రాజధాని పేరుతో చంద్రబాబు వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు, ఆయన బినామీలు నాలుగువేల ఎకరాలు కొని సంపద సృష్టించుకున్నారని ఆరోపించారు. పేదల భూములు భయపెట్టి టీడీపీ నాయకులు లాక్కున్నారని, ఇప్పుడు టీడీపీ నేతల భూ కుంభకోణం బయటకు వస్తుందన్న భయంతోనే చంద్రబాబు భయపడుతున్నారని దుయ్యబట్టారు. సీఎం నిర్ణయం తరువాత కొంతమంది రైతుల పేరుతో చేస్తున్నది గమనించాలని కోరారు. వైఎస్సార్సీపీ చెప్పిన ప్రతి దాన్ని వ్యతిరేకించడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చూస్తుందని చెప్పారు. రైతుల ముసుగులో రాజకీయం చేస్తే సహించమని అంబటి రాంబాబు హెచ్చరించారు.