అమరావతి: మండలిలో బుధవారం జరిగిన పరిణామాలపై సీఎం జగన్ సీరియస్గా ఉన్నారు. అసెంబ్లీని ప్రోరోగ్ చేసి అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు సంబంధించి ఆర్డినెన్స్ తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి తాడేపల్లిలోని తన ఇంట్లో న్యాయ నిపుణులు, ఎంపీ విజయసాయిరెడ్డితో ఆయన చర్చిస్తున్నట్లు సమాచారం.
రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సెలెక్ట్ కమిటీకి వెళ్లకూడదన్న వైసీపీ వ్యూహం విఫలమైంది. సెలెక్ట్ కమిటీలో ఈ బిల్లు ప్రక్రియ ముగియడానికి కనీసం మూడు నెలలు పడుతుంది. అయితే రాజధాని వికేంద్రీకరణ ప్రక్రియను ఆగమేఘాల మీద ముగించాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ సెలెక్ట్ కమిటీకి పంపకుండా ఆపకుండా శాయశక్తులా ప్రయత్నించింది. టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం ఫలించి బిల్లు సెలెక్ట్ కమిటీ బాట పట్టింది. అయితే, ఈ బిల్లు విషయంలో ప్రభుత్వానికి మద్దతిచ్చిన వారిపై అనర్హత వేటు వేయడానికి టీడీపీ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
మరోవైపు మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లులపై సెలక్ట్ కమిటీ నిర్ణయం ఏళ్లు కూడా పట్టవచ్చని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు చెప్పారు. సెలెక్ట్ కమిటీ కాలపరిమితి కనీసం మూడు నెలలని..అవసరమైతే పొడిగించవచ్చని తెలిపారు. సెలెక్ట్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల అభిప్రాయాలు సేకరిస్తుందన్నారు. బిల్లు సెలెక్ట్ కమిటీలో ఉన్నప్పుడు ఆర్డినెన్స్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పారు. గతంలో రాష్ట్రపతి ఆర్డినెన్స్లను తిరస్కరించారని.. సుప్రీం తీర్పు ఇచ్చిందని యనమల గుర్తుచేశారు. మండలిని ప్రోరోగ్ చేయకుండా ఆర్డినెన్స్ ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఆర్డినెన్స్ ఇచ్చినా కోర్టులో నిలబడదన్నారు. మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలకు రూల్ 71పై అవగాహన లేదని, రూల్ 154 కింద చైర్మన్ విచక్షణాధికారాలను కోర్టులు ప్రశ్నించలేవని పేర్కొన్నారు. శాసనమండలి రద్దు జగన్ వల్ల కాదని స్పష్టం చేశారు. మండలి రద్దుపై తీర్మానం మాత్రమే చేయగలరని పార్లమెంట్ ఆమోదించాలి… రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇవ్వాలని యనమల తెలిపారు.