అమరావతి: ఏపీ పరిపాలనా రాజధాని విశాఖేనని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖ నగరానికి తుఫానుల ముప్పు పొంచి ఉందంటూ జీఎన్రావు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కమిటీలు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికల్లో పేర్కొన్నాయని పలు మీడియా సంస్థలో కథనాలు వచ్చాయి. దీనిపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ.. మూడు రాజధానుల ప్రక్రియ ఆలస్యం కావొచ్చేమో గానీ.. ఏర్పాటు మాత్రం తథ్యమని స్పష్టంచేశారు. ప్రభుత్వ నిర్ణయంలో మార్పు ఉండబోదని తెగేసి చెప్పారు. అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల శ్రేయస్సు కోసమే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. అన్ని అంశాలపై చర్చించాకే వికేంద్రీకరణపై నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఎల్లో మీడియా ఇష్టమొచ్చినట్లు ఊహించుకుంటోందని విమర్శించారు. అసలు తుపాను ముప్పు లేకుండా ఏ నగరం అయినా ఉంటుందా? అని ప్రశ్నించారు. పలు పత్రికలపై ఆయన మండిపడ్డారు. వక్రభాష్యం పలుకుతూ నివేదికలపై ఆరోపణలు చేయొద్దని కోరారు. కమిటీల ప్రతులను చెత్తకుప్పలో వేసేయాలని, చించేయాలని గతంలో చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు అదే కమిటీ పేరిట మరోలా రాజకీయాలు చేస్తున్నాని మండిపడ్డారు. ఏపీ అభివృద్ధికి ఎవరూ ఆటంకం కలిగించవద్దని మంత్రి బొత్స విజ్ఞప్తి చేశారు. మూడు రాజధానులు, మండలి రద్దుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆర్థిక భారం తప్ప.. మండలి వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, అందుకే ఆ మండలి రద్దు కోసం అసెంబ్లీ తీర్మానం చేసిందని చెప్పారు.
“శాసనమండలి రద్దు గురించి 1980ల్లో చంద్రబాబు ఏం మాట్లాడారో, రాజశేఖర్ రెడ్డి మళ్లీ పునరుద్ధరించినప్పుడు ఏం మాట్లాడారో చూశాం. మళ్లీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో చూస్తున్నాం. తన రాజకీయాల కోసం ఎలాగైనా మాట్లాడతారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.తనకు ప్రయోజనాలు కలిగే విషయంలో ఇదో అద్భుత ఆలోచన అంటారు. తనకు రాజకీయ ప్రయోజనాలు లేనప్పుడు ఇదో దుర్మార్గమైన ఆలోచన అంటారు. చంద్రబాబుది రెండు నాలుకల ధోరణి. ఏ అంశంపై కూడా చంద్రబాబుకి అవగాహన లేదు. సునామీ, తుపానులు వస్తే నష్టం అని, విశాఖలో రాజధాని వద్దని అంటున్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే మా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బోస్టన్, జీఎన్ రావు కమిటీలకు అందరూ క్షుణ్ణంగా పరిశీలించాలి. మేము ఒక్క రాజధాని పెట్టడం లేదు కదా? మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నాం. చంద్రబాబు నాయుడిలా మేము వ్యాపారుల సలహాలు తీసుకోము. కమిటీల ప్రతిపాదలను క్షుణ్ణంగా పరిశీలించి, చర్చించి నిర్ణయం తీసుకున్నాం” అని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు.
కాగా, విశాఖ రాజధానిగా వద్దని జీఎన్రావు కమిటీ తెలిపిందని, ఈ విషయాన్ని దాచి పెట్టి ప్రభుత్వం రాజధాని ప్రకటన చేసిందని బుధవారం తెలుగు వార్తా పత్రికల్లో కథనాలు వచ్చాయి. విశాఖలో రాజధాని ఏర్పాటుకు ఎన్నో ప్రతికూలతలు ఉన్నాయని, తుపాన్లు, సముద్ర మట్టంతో ముంపు ముప్పు ఉందని, పర్యావరణపరమైన సమస్యలు ఉన్నాయని కమిటీ చెప్పందని పత్రికలు పేర్కొన్నాయి.