ravaఅమరావతి: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళన ఆదివారంనాటికి 19వ రోజుకు చేరింది. ఇవాళ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. వివిధ గ్రామాల్లో మహా ధర్నాలతోపాటు నిరసన కార్యక్రమాలు ఉధృతం చేశారు. మందడం, తుళ్లూరులో మహాధర్నాలు నిర్వహించనుండగా… వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగనున్నాయి. వెలగపూడి గ్రామంలో రైతులు ఆదివారం ఉదయం 8 గంటల నుంచే దీక్షా శిబిరంలో బైఠాయించారు. శనివారం అమరావతి ప్రాంతంలో బంద్ పాటించిన అన్నదాతలు.. ఆదివారం నుంచి తమ ఆందోళనను మరింత ఉధృతం చేయనున్నట్లు ప్రకటించారు. రాజకీయాలను పక్కనబెట్టి అన్ని పార్టీల నేతలు ఉద్యమానికి సహకరించాలని అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు కోరారు. ప్రభుత్వం మూడు రాజధానులపై వెనక్కి తగ్గేవరకు తమ ఆందోళనలు విరమించేది లేదని స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో పొంగళ్లు వండి నిరసన తెలిపారు. తుళ్లూరులో నిర్వహిస్తున్న మహాధర్నాకు రైతులు, కూలీలు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. గుంటూరు ప్రకాశం, గోదావరి జిల్లాల్లోనూ రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలు ఆందోళనలు చేపట్టాయి. గుంటూరులో అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు పెద్ద సంఖ్యలో భారీ ర్యాలీ నిర్వహించారు.
మరోవైపు రాజధాని గ్రామాల్లో పోలీసులకు సహాయం చేసేందుకు గ్రామస్తులు నిరాకరిస్తున్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మహిళలను అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తమ ఇళ్ల వద్ద నిలబడడానికి కూడా వీల్లేందని గ్రామస్తులు చెబుతున్నారు. అంతేకాదు పోలీసులకు మంచి నీళ్లు కూడా అమ్మడం మానేశారు.