(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: రాజధాని మార్చాలనుకోవడం తప్పుడు సంప్రదాయమని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా వ్యాఖ్యానించారు. ఏపికి మూడు రాజధానులు ఏ మాత్రం ప్రయోజనం కాదనీ, అమరావతిలోనే రాజధాని కొనసాగించాలనీ ఆయన డిమాండ్ చేశారు.
మూడు రాజధానులు ఎందుకు కావాలనుకుంటున్నారో జగన్ సమాధానం చెప్పాలని రాజా కోరారు. భూములు ఇచ్చిన రైతుల ఆవేదనను కూడా సిఎం జగన్ పరిగణలోకి తీసుకోవాలని ఆయన కోరారు. రాజధాని నిర్మాణంలో కేంద్రం కూడా ఒక భాగస్వామి అని ఆయన అన్నారు. కేంద్రం కూడా వెంటనే దీనిపై జోక్యం చేసుకోవాలని రాజా విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల నేతల అరెస్టులను ఆయన ఖండించారు. జగన్ ఉద్యమాలను అణచివేత ధోరణిని ప్రదర్శిస్తే ఉద్యమాలు మరింత తీవ్రతరం అవుతాయని ఆయన హెచ్చరించారు.